close
Choose your channels

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సాయమందిస్తూ.. ఐదుగురి దుర్మరణం

Saturday, December 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముక్కూ మొహం తెలియకున్నా.. తోటి మనిషి ప్రమాదంలో గాయపడ్డాడని వారి హృదయం తల్లడిల్లిపోయింది. పాపం అంటూ అతడిని తమకు తెలిసిన ప్రథమ చికిత్సను అయినా అందించాలని ఆ నిరుపేదలు వెళ్లారు. అంతే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పాడు లారీ ఆ ఆరుగురి పైనుంచి వెళ్లిపోయింది. కళ్లు మూసి తెరిచేలోగా దారుణం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన నలుగురూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒక్కరు మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలంలోని రాఘవంపల్లి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకొంది. రాఘవంపల్లికి చెందిన రైతు శ్రీకాంతప్ప ఒక్కగానొక్క కుమారుడు రాజశేఖర్‌(20). కాగా.. రాజశేఖర్ అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తుండగా రాఘవంపల్లి క్రాస్‌ వద్ద కదిరి నుంచి అనంతపురం వెళ్తున్న కారు ఆయన బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. కారులోని వారు మాత్రం రాజశేఖర్ పరిస్థితిని కూడా గమనించకుండా.. కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న కూలీలు.. రాజశేఖర్ తీవ్రంగా గాయపడి ఉండటాన్ని గమనించి ఆగిపోయారు.

వెంటనే తాము ప్రయాణిస్తున్న ఆటో దిగి రాజశేఖర్‌కు సాయం అందించేందుకు వెళ్లారు. బాధితుడికి వారు సపర్యలు చేస్తుండగానే బత్తలపల్లి వైపు నుంచి వేగంగా వస్తున్న సిమెంట్‌ లారీ కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు నలుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. వారిని తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన శ్రీనివాసులు(40), ముష్టూరుకు చెందిన శివమ్మ(50), సంజీవపురానికి చెందిన సూరి(45), వలి(50)లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో శ్రీనివాసులు ఘటనాస్థలంలోనే మరణించగా, మిగతా వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. లింగారెడ్డిపల్లికి చెందిన రాజు అనే కూలీ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన కారు, లారీ డ్రైవర్లు వాహనాలు వదిలేసి పరారయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.