close
Choose your channels

లగడపాటి రాజకీయమే కాదు.. ఇక పై సర్వే సన్యాసం కూడా!!

Friday, May 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికలు.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన ‘ఆర్జీప్లాష్’ టీమ్ సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో తన సర్వే ప్లాప్ అయ్యిందేమో కానీ.. ఈసారి మాత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఈ ఎన్నికల్లో తాను చెప్పినట్లుగా టీడీపీ గెలవకపోతే సర్వేలు చేయనని చెప్పుకొచ్చారు.

అయితే ఆయన చేసిన సర్వే ఏపీలోనూ డబుల్ అట్టర్ ప్లాప్ అయ్యింది. వైసీపీ ఎవరూ ఊహించని.. కనివినీ ఎరుగని రీతిలో.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రికార్డులు సైతం బ్రేక్ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే లగడపాటి సర్వే అట్టర్ ప్లాప్ కావడంతో బెట్టింగ్ రాయుళ్లు, టీడీపీ నేతలు పలువురు రోడ్డున పడాల్సిన పరిస్థితి. అంతేకాదు లగడపాటి ఎక్కడైనా కనపడితే అడ్రస్ చెప్పండి అని.. పలువురు సోషల్ మీడియాలో.. టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున ఫొటోలు వైరల్ చేసిన సంగతి తెలిసిందే. పలు రకాలుగా లగడపాటిపై సెటైర్ల వర్షం కురిపించారు.

అయితే లగడపాటి సర్వే రెండోసారీ అట్టర్ ప్లాప్ కావడంపై స్పందించారు. ప్రస్తుతం మణిపాల్‌లో వేసవి విడిదికోసం వెళ్లిన ఆయన ఓ ప్రకటనలో క్షమాపణలు కోరారు. అంతేకాదు ముందుగా చెప్పినట్లుగానే ఇకపై సర్వేలు చేయనని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రాభివృద్ధికి, నూతన ప్రభుత్వానికి తోడ్పడాలని లగడపాటి ఆకాంక్షించారు.

లగడపాటి ప్రకటన యథావిథిగా...

"తెలంగాణ, ఏపీ శాసనసభ ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నాను. ఇందుకు కారణాలు ఏమైనా సరే వరుసగా రెండు సార్లు విఫలమయ్యాను. ఇకపై భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. 2014 లో కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఎంపీ పదవికి రాజీనామా చేశాను. ఆ తర్వాత రాజకీయాల నుంచి విరమించుకున్నాను. అప్పటి నుంచి నేను ఏ పార్టీకీ అనుబంధంగా వ్యవహరించలేదు. 2004 నుంచి సర్వేలు నాకు ఒక వ్యాపకంగా మారాయి.

ప్రజల నాడి ఎవరికి అనుకూలమైనా లేదా వ్యతిరేకమైనా కూడా పక్షపాతం లేకుండా చెప్పాను. ఈ కోవలోనే ఏపీ, తెలంగాణలో కూడా మీడియా ద్వారా సర్వే వివరాలను ప్రజలకు వివరించాను. నా సర్వే ఫలితాల వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే మన్నించమని కోరుతున్నాను" అని లగడపాటి ప్రకటనలో పేర్కొన్నారు. సో.. లగడపాటి ప్రకటనపై బెట్టింగ్ రాయుళ్లు, టీడీపీ అధినేత, తెలుగు తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.