విదేశాల్లో ఉన్న చంద్రబాబుకు షాక్ల మీద షాక్లు!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే చేరిక ఢిల్లీ వేదికగా.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో జరిగింది. ఈ చేరికతో టీడీపీకి ఎదురుదెబ్బ తగలగా.. తాజాగా అమరావతి వేదికగా మరో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకీ ఆ కోలుకోలేని ఎదురుదెబ్బేంటి..? అది కూడా అమరావతి వేదికగా ఏం జరిగింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇచ్చే ప్రసక్తే లేదు..!
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా నది కరకట్టపై నివాసముంటున్న సంగతి తెలిసిందే. ఆయన నివాసం పక్కనే ఉన్న ‘ప్రజావేదిక’ భవనం.. టీడీపీకి కేటాయించాలని.. పక్కనే చంద్రబాబు నివాసం ఉండటంతో కార్యకర్తలు, నేతలతో సమావేశాలకు అనువుగా ఉంటుందని భావించి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికి తెలుగు తమ్ముళ్లతో పాటు చంద్రబాబు సైతం లేఖలు రాశారు. అయితే అది వివాదాస్పద, అక్రమ కట్టడం అని అప్పట్లో వైసీపీ నేతలు బాగా హంగామా చేశారు. అంతేకాదు.. టీడీపీకి అస్సలు ఇచ్చే ప్రసక్తే లేదని అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని మరికొందరు వైసీపీ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు.
ఈ నెల 24 లోపు ఖాళీ చేయాల్సిందే..!
అయితే.. ముందుగా అనుకున్నట్లుగానే శుక్రవారం సాయంత్రం అమరావతి వేదికగా టీడీపీకి కోలుకోలేని షాకే తగిలింది. ఉండవల్లిలోని ప్రజావేదికను టీడీపీకి ఇవ్వడం కుదరదని.. ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాదు.. టీడీపీకి సంబంధించిన సామాగ్రిని తీసుకుని వెళ్లాలని ఇప్పటికే టీడీపీ పెద్దలకు సీఆర్డీఏ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 24లోపు సామాగ్రి మొత్తం తీసుకెళ్లిపోవాలని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా.. ఈనెల 24న ప్రజావేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
అయితే.. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు యూరప్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆయన పర్యటనలో ఉండగానే అటు ఎంపీలు జంప్ అవ్వడం.. ఇటు ప్రజావేదికను ఖాళీ చేయమనడం.. మరోవైపు 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతున్నారనే వార్తలు టీడీపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.