close
Choose your channels

పెద్ద హీరోలతో చేయాలంటే భయం: మోహనకృష్ణ ఇంద్రగంటి

Tuesday, September 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పెద్ద హీరోలతో చేయాలంటే భయం: మోహనకృష్ణ ఇంద్రగంటి

మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘వి’. నేచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్‌, హ‌ర్షిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబ‌ర్ 5న ‘వి’ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు థియేటర్స్ కోసమే ఎదురు చూసిన ఈ చిత్రం.. పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో.. ఓటీటీ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబ‌ర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మీడియాతో మాట్లాడారు.

‘వి’ సినిమా మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అమిత్ త్రివేదినే చేయాల‌నుకున్నారని... కానీ వేరే క‌మిట్‌మెంట్ ఉండ‌టం వ‌ల్ల త‌ను మ‌ధ్య‌లో వెళ్లిపోవాల్సి వ‌చ్చిందన్నారు. ఆ స‌మ‌యంలో తమకు త‌మ‌న్‌ను సంప్ర‌దిస్తే ఎలా ఉంటుంద‌ని అనిపించిదని.. అయితే తమన్ అప్పుడు ‘అల వైకుంఠ‌పుర‌ములో’ స‌క్సెస్ మీదున్నాడన్నారు. అయినా తాము అడ‌గ్గానే వెంటనే చేసి పెట్టాడన్నారు. పెద్ద హీరోల‌తో ప‌నిచేయాలంటే కాస్త భ‌యంగా ఉంటుందని... అందుకు కార‌ణం వారికి ఉండే ఇమేజ్‌, వారి సినిమాల‌పై అంచ‌నాలు, అభిమానుల కోరుకునే అంశాలు వేరుగా ఉండటమేనన్నారు. తాను ముందు క‌థ రాసుకుని హీరో ఎవ‌ర‌ని ఆలోచిస్తానని... అలాగే ఈ సినిమా విషయంలో కూడా చేశానని మోహనకృష్ణ తెలిపారు. ప్రస్తుతం మూడు, నాలుగు సినిమాలు చేయ‌డానికి క‌మిట్ అయ్యానన్నారు. అవి పూర్త‌యిన త‌ర్వాత దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేస్తానన్నారు. అలాగే విజయ్ దేవరకొండ సినిమా చేయాల్సి ఉందని మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు.

అష్టాచ‌మ్మా, జెంటిల్‌మ‌న్ చిత్రాల త‌ర్వాత నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందిన మూవీ ఇది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మార్చిలోనే విడుదలకు సిద్ధమైన ఈసినిమా కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికే ఐదు నెలలకు పైగా వేచి చూశామని అందుకే ఓటీటీలో విడుదల చేయాలని భావించినట్టు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. ఏ సినిమా అయినా విడుదలైన తొలి వారంలోనే చూసెయ్యాలి అనుకునే ప్రేక్షకులకు దీనిని ఓటీటీలో విడుదల చేస్తుండటంతో తొలిరోజునే చూసే అవకాశం కలిగిందన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.