లెఫ్ట్ పార్టీలకు 14 అసెంబ్లీ, 4 లోక్సభ సీట్లిచ్చిన జనసేన
Send us your feedback to audioarticles@vaarta.com
వామపక్ష పార్టీలకు 14 అసెంబ్లీ స్థానాలు, నాలుగు లోక్ సభ స్థానాలను కేటాయించినట్లు జనసేన పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాట్లపై పలు చర్చల అనంతరం సీపీఎం పార్టీకి 7 శాసనసభ, రెండు లోక్ సభ స్థానాలు, సీపీఐ పార్టీకి 7 శాసనసభ, రెండు లోక్ సభ స్థానాలను కేటాయించినట్లు తెలిపారు.
విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సీట్ల సర్దుబాట్లపై సీపీఎం, సీపీఐ నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం మీడియా మాట్లాడిన పవన్.."ఎంపీగా పోటీ చేయాలంటే రూ. 100 కోట్లు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రూ. 50 కోట్లు ఉండాలన్న పిచ్చి లెక్కలతో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ధనవంతులే చట్టసభలకు వెళ్తే అణగారిన వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుంది..? డబ్బుతో చేసే రాజకీయానికి ముగింపు పలకాలి. జనసేన, బీఎస్పీ, సీపీఎం, సీపీఐలతో కలిసి పోటీ చేస్తున్నాం. దానిలో భాగంగానే వామపక్షాలకు నాలుగు పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలు ఆలోచించి ఇచ్చాం. సమస్యలపై పోరాటానికి సీపీఎం, సీపీఐ పార్టీలు కావాలి కానీ, చట్టసభలకు వెళ్లడానికి వామపక్షాలు అవసరం లేదా..?" అని అధికార, ప్రతిపక్ష పార్టీలను పవన్ ప్రశ్నించారు.
సీపీఎంకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలివే..
కురుపాం (విజయనగరం జిల్లా)
అరకు (విశాఖపట్నం జిల్లా)
రంపచోడవరం (తూర్పుగోదావరి జిల్లా)
ఉండి (పశ్చిమగోదావరి జిల్లా)
విజయవాడ సెంట్రల్ (కృష్ణా జిల్లా)
సంతనూతలపాడు (ప్రకాశం జిల్లా)
కర్నూలు (కర్నూలు జిల్లా)
పార్లమెంటు స్థానాలు
కర్నూలు
నెల్లూరు
సీపీఐకు కేటాయించిన అసెంబ్లీ స్థానాలివే..
పాలకొండ (శ్రీకాకుళం జిల్లా)
ఎస్.కోట (విజయనగరం జిల్లా)
విశాఖ వెస్ట్ (విశాఖపట్నం జిల్లా)
నూజివీడు (కృష్ణా జిల్లా)
మంగళగిరి (గుంటూరు జిల్లా)
కనిగిరి (ప్రకాశం జిల్లా)
డోన్ (కర్నూలు జిల్లా)
పార్లమెంటు స్థానాలు
అనంతపురం
కడప
కాగా.. సీపీఐ, సీపీఎంలు పోటీ చేస్తే స్థానాల్లో అటు టీడీపీ.. ఇటు వైసీపీ తరఫున ఉద్ధండులే పోటీ చేస్తున్నారు. అయితే లెఫ్ట్పార్టీలు ఏ మేరకు సీట్లు, ఓట్లు సంపాదించుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.