close
Choose your channels

ఇంకో 2-3 పథకాలున్నాయ్.. అవి తీసుకొచ్చానో అంతే!!

Sunday, September 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంకో 2-3 పథకాలున్నాయ్.. అవి తీసుకొచ్చానో అంతే!!

తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను కేసీఆర్ సర్కార్ ప్రారంభించింది. మరికొన్ని పథకాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అయితే ఆదివారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రారంభించిన పథకాలే కాకుండా మా దగ్గర ఇంకో రెండు, మూడు పథకాలు ఉన్నాయని.. అవి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అనేది అడ్రస్ కనపడదని గులాబీ బాస్ బల్లగుద్ది చెప్పారు. ఆదివారం నాడు 2017-18 కాగ్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం.

ప్రజలకు కాదు.. కాంగ్రెస్‌కే!

‘ముస్లిం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు. మైనార్టీ రిజర్వేషన్లపై కేంద్రం నానుస్తోంది. ముస్లింల రిజర్వేషన్లపై అవసరమైతే మరోసారి తీర్మానం చేస్తాం. ఎన్‌ఆర్సీపై కేంద్ర నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎన్‌ఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌ నేతలకు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ప్రమాదం వస్తోంది ప్రజలకు కాదు.. కాంగ్రెస్‌కే. పాతబస్తీలో కూడా మెట్రో పనులు ప్రారంభిస్తాం. సభలో కాంగ్రెస్‌ బలం 21 నుంచి 9కి.. బీజేపీ 5నుంచి 1కి పడిపోయింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై కాంగ్రెస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోంది. ఎన్నికల సమయంలో నేను కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడలేదు. అభివృద్ధి కోసమే అప్పులు చేశాం.. అవసరమైతే ఇంకా చేస్తాం. 40 ఏళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. మేమొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తి చేసి చూపించాం. కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌కు అర్హత లేదు!

‘పార్టీ ఫిరాయింపులపై బీజేపీ, కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయి. కేంద్రంలో టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమయ్యారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో బీఎస్పీని విలీనం చేసుకున్నారు. రాజ్యాంగబద్దంగానే టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం చేశాం. రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుందా?. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా టీఆర్‌ఎస్‌లో చేరలేదు. టీఆర్‌ఎస్‌లో చేరతామంటే మేము అభ్యంతరం చెప్పాం.. సీఎల్పీ విలీనమైతే అనర్హత ఉండదని చెప్పాను. కాంగ్రెస్‌ గాలి పిటిషన్లు గాలికే పోతాయి. ఉద్యమసమయంలో టీఆర్‌ఎస్‌ను చీల్చిన కాంగ్రెస్‌కు ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం హరించింది!

‘కాంగ్రెస్‌ అవలంభించిన దుష్ట విధానాల వల్ల రాష్ట్రాలు చతికిలాపడ్డాయి. ప్రభుత్వాలు మారాయి..పథకాల పేర్లు మారాయి కానీ ఏదీ మారలేదు. దేశంలో నిరుద్యోగం, అప్పులకు కాంగ్రెస్‌, బీజేపీనే కారణం. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేశాం కానీ.. మల్లు భట్టి, శ్రీధర్‌బాబు పదవులు పట్టుకుని వేలాడారు. కాంగ్రెస్‌ హయాంలో గొప్ప పాలన జరిగి ఉంటే దళితులకు సబ్‌ ప్లాన్‌ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరితే కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరించింది. రాష్ట్రాల జాబితాలో ఉండేవి కేంద్ర జాబితాలోకి వెళ్లాయి. కాంగ్రెస్‌ కంటే ఎక్కువగా బీజేపీ అన్యాయం చేస్తోంది. అన్యాయంపై మాట్లాడేవారిని అడ్డుకుంటున్నారు. అవసరమైతే ఇద్దరు కుమ్మక్కుకావడం..ఇది కొత్తగా వచ్చింది. జీఎస్టీపై కాంగ్రెస్‌ సీఎంలు మాట్లాడలేదు. లిఖితపూర్వకంగా అభ్యంతరం చెప్పాం. ప్రాజెక్ట్‌ పనులు, బీడీ పరిశ్రమ, గ్రానైట్‌..వాటిపై జీఎస్టీ వద్దని చెప్పాం’ అని ఈ సందర్భంగా కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.

మరో మూడు టర్మ్‌లో టీఆర్‌ఎస్‌దే అధికారమని ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా తెలిపారు. ఇదిలా ఉంటే.. కేసీఆర్ చెప్పిన ఆ రెండు, మూడు పథకాలేంటి..? అనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి చూస్తే వచ్చే టెర్మ్‌లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కేసీఆర్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.