close
Choose your channels

జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా.. వాళ్లకి బూస్టర్ డోస్: ప్రధాని మోడీ ప్రకటన

Sunday, December 26, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా ఇస్తామని.. అలాగే జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోసు అందజేస్తామని ఆయన వెల్లడించారు. శనివారం జాతినుద్దేశించి ప్రసగించిన ప్రధాని.. ఒమిక్రాన్‌ నివారణకు టీకా, జాగ్రత్తలే మందన్నారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ వస్తోందని ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దని.. మాస్కులు ధరిస్తూ, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ పడకలు సిద్ధంగా ఉన్నాయని ప్రధాని మోడీ చెప్పారు. వీటితో పాటు కోటీ 40 లక్షల ఐసీయూ బెడ్లు , చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని  ప్రధాని వెల్లడించారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని.. గోవా, హిమాచల్‌ వంటి రాష్ట్రాలు వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకున్నాయని తెలిసినప్పుడు గర్వంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. త్వరలో నాసికా వ్యాక్సిన్‌, ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా మన దేశంలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. కరోనా ఇంకా పోలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలని మోడీ అన్నారు.

వైద్య సిబ్బంది కఠోర శ్రమ వల్లే వందశాతం వ్యాక్సినేషన్‌ సాధ్యమైందని ప్రధాని మోడీ ప్రశంసించారు.  గడిచిన 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోందని.. అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో భారత్ ముందుందని ఆయన తెలిపారు. కరోనా భయం ఇంకా పూర్తిగా పోలేదని గుర్తించాలని.. దేశంలోని 90 శాతం వయోజనులకు మొదటి డోసు పంపిణీ పూర్తయిందని ప్రధాని తెలిపారు.

జనవరి 3, 2022 నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభిస్తామని... దీని వల్ల పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళనలు తగ్గనున్నాయని చెప్పారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు బూస్టర్ డోస్ ఇస్తారని..  జనవరి 10, 2022 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. దీనితో పాటు తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి కూడా బూస్టర్ డోస్ ఇస్తామన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.