కష్టమొస్తే ‘గన్’ కంటే ముందే ‘జగన్’ రావాలి.. రోజా రెక్వెస్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆడపిల్లకు కన్నీరొస్తే ‘గన్’ కంటే ముందు వైఎస్ జగన్ వస్తాడనే నమ్మకమని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై పెద్ద ఎత్తున చర్చే జరిగింది. ఈ సందర్భంగా ఏపీలో మహిళల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే దానిపై హోం మంత్రి మొదలుకుని సీఎం వైఎస్ జగన్, మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ఆడపిల్లకు అన్యాయం జరిగితే వెంటనే శిక్షపడాలని.. శిక్ష వెంటనే అమలు జరిగితే మగాడికి వెన్నులో వణకు పుడుతుందన్నారు. న్యాయం జరగలేదని కాబట్టే దిశ ఘటనలో నిందితులను మహిళలంతా ఎన్కౌంటర్ చేయాలని కోరుకున్నారన్నారు. ఎవరైనా ఆడపిల్ల జోలికొస్తే వెన్నులో వణుకు పుట్టే చట్టం చేయాలని ఈ సందర్భంగా జగన్ను రోజా కోరారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆడపిల్లల ఆంధ్రప్రదేశ్గా మారాలని.. ఆడపిల్లకు అన్యాయం జరిగితే సత్వర న్యాయం జరగాలన్నారు.
జగన్ అన్నా అనే పిలుస్తారు!
‘ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆడపిల్ల.. అన్నా అని జగన్ను పిలుస్తారు. మహిళలను సీఎం జగన్ గౌరవం ఇస్తారు కాబట్టే డిప్యూటీ సీఎం పదవిని కూడా మహిళకు ఇచ్చారు. మహిళలపై ఘోరాలు జరగడానికి మూల కారణం మద్యం.. మహిళలు ఆపదలో ఉంటే 112 టోల్ ఫ్రీ నంబర్ను తీసుకొచ్చారు. ఎక్కడైనా సరే ఫిర్యాదు చేయడానికి జీరో ఎఫ్ఐఆర్ను జగన్ తీసుకొచ్చారు. ఆడపిల్లను అన్ని విధాలా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహిళల భద్రతపై చర్చిస్తుంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ చేస్తుందని, మహిళల పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. దిశ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయని, కాల్మనీ సెక్స్ రాకెట్, లోకేష్ ఫోటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారో అన్న భయం చంద్రబాబుకు పట్టుకుంది. లోకేష్కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధపడుతున్నారు’ అని రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బహుబలి సినిమాలో లాగా..!
‘ఆడవాళ్లు ఎందుకు ఇన్ని హింసలు భరిస్తున్నారంటే.. చదువు కోసం, బతుకుదెరువు కోసం మాత్రమే. వాళ్లు తిరగబడితే ఏమవుతుందో చూస్తున్నాం. ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే.. బహుబలి సినిమాలో సేనాధిపతి భార్య భుజంపై మరో సేనాధిపతి చేయి వేసి వెకిలి చేష్టలు చేస్తే.. ఆ హీరో కామాంధుడి తల తెగనరికాడు. ఆ రోజు థియేటర్లో చూశాను. ఆడవాళ్ల కళ్లలో ఆనందం చూశాను.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఈ రోజు దిశను హత్య చేసిన వారు ఎన్కౌంటర్ అయ్యారు. నిర్భయను హత్య చేసిన వాళ్లు జైల్లో ఉన్నారు. రిషితేశ్వరిని హత్య చేసిన వారికి ఇంతవరకు ఎలాంటి శిక్ష పడలేదు. అదే స్వప్నిక, ప్రణితలపై యాసిడ్ దాడి చేసిన వారిని దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో శిక్షించారు. ఇవన్నీ కూడా మీడియాలో హైలెట్ అయ్యాయి. మీడియాకు దొరక్కుండా చనిపోయిన ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. మీడియాలో కనిపించకపోతే మానం, ప్రాణం కాదా? ఆడపిల్లలకు కష్టం వస్తే.. గన్ వచ్చే లోపే సీఎం వైయస్ జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం కావాలి’ అని ప్రభుత్వాన్ని రోజా కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.