‘వైఎస్ జగన్ పారిపోయాడు.. నారా లోకేశ్ నిలబడ్డాడు!’
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటబ్బా..? ఏదో లాజిక్ మిస్సయ్యిందే అని అనుకుంటున్నారు కదా.. అదేం లేదండోయ్.. స్వయానా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలివి. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష పార్టీ సభ్యులు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకే అవకాశం రాకపోదా..? అని ఎదురుచూస్తున్న బాబుకు ఓ సువార్ణావకాశం రానే వచ్చింది. దీంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓ ఆట ఆడుకున్నారు.! ఇంతకీ మంగళవారం అసెంబ్లీలో ఏం జరిగింది..? జగన్ ఎలా పారిపోయారు..? నారా లోకేష్ ఎలా నిలబడ్డాడు..? అనే విషయాలు బాబుగారి మాటల్లోనే తెలుసుకుందాం.
ఛాన్స్ వచ్చిందిగా..!?
అసలే మంగళవారం సమావేశాలు ప్రారంభమైన క్షణం నుంచి సొంత పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలతో హర్ట్ అయిన బాబు.. వాకౌట్ చేసి మళ్లీ తిరిగొచ్చారు. ఈ క్రమంలో అధికార పార్టీని టార్గెట్ చేయాలని చూసినప్పటికీ వరుసగా మంత్రులు లేచి కౌంటర్లే కౌంటర్లు కురిపించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.! సరిగ్గా ఇదే టైమ్లో వైఎస్ జగన్ సోమవారం నాడు సభలో మాట్లాడిన ‘దిశ ఘటన’ బాబుకు గుర్తొచ్చింది. దీంతో ఒకాట ఆడుకోవచ్చని భావించి.. నిన్న అసెంబ్లీలో జరిగిన ప్రస్తావన ఇవాళ మాట్లాడారు.
స్కూటీకి టోల్ కడతారా..!?
వాస్తవానికి వైఎస్ జగన్ నిన్న దిశ ఘటన గురించి మాట్లాడుతూ.. ‘టోల్ ప్లాజాలో డాక్టర్ దిశ స్కూటీకి టోల్ కడుతుండగా ఫలానా ఘటన జరిగింది’ అని అన్నారు. అయితే ఈ మాటలు అటు నెట్టింట్లో.. ఇటు మీడియాలో పెద్ద ఎత్తున కోడై కూశాయి. అంతేకాదు సోషల్ మీడియాలో టీడీపీ-జనసేన వర్సెస్ వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు పెద్ద ఎత్తునే మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ ఘటననే చంద్రబాబు కూడా ప్రస్తావించారు. స్కూటీకి ఎవరైనా ఎవరైనా టోల్ కడతారా..? అని ప్రశ్నించారు. జగన్ ఏదో పొరపాటుతో అలా మాట్లాడి ఉంటారేమోనని తాను అనుకుంటున్నానన్నారు. మాట్లాడాలనుకుంటే... విమర్శలు చేయాలనుకుంటే తాను కూడా ఎన్నో చేయగలనంటూ వైసీపీకి ధీటుగా సమాధానం చెప్పేందుకు బాబు భగీరథ ప్రయత్నమే చేశారు.
జగన్ పారిపోయాడు.. లోకేశ్ నిలబడ్డాడు!
అయితే పైన చెప్పిన వ్యవహారం పెద్దగా పేలకపోవడంతో మరోసారి వైఎస్ జగన్ను చంద్రబాబు టార్గెట్ చేశారు. ఉన్నత చదువుల కోసం వైఎస్ జగన్ను ఆయన తల్లిదండ్రులు అమెరికాకు పంపిస్తే.. ఆయన మాత్రం పారిపోయి ఇండియాకు వచ్చేశాడని విమర్శనాస్ట్రాలు ఎక్కుపెట్టారు. అంతటితో ఆగని బాబు.. జగన్-నారా లోకేష్కు పోలిక పెట్టారు. తన కుమారుడు నారా లోకేష్ను మాత్రం అమెరికాలోనే నిలబడి ఉన్నత చదువులు పూర్తి చేశాడని చెప్పుకొచ్చారు. అంటే జగన్ పారిపోయాడు.. నారా లోకేష్ నిలబడ్డాడడని సభా ముఖంగా బాబు చెప్పడానికి యత్నించారన్న మాట.
నో కౌంటర్!
అయితే బాబు వ్యాఖ్యల అనంతరం వైసీపీ సభ్యులు మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా.. గతంలోనూ ఓ సారి జగన్ చదువు గురించి బాబు మాట్లాడగా.. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆయన తాను ఎక్కడెక్కడ చదివారో అన్ని స్కూల్ వివరాలతో సహా బయటపెట్టి బాబుకు గట్టిగానే కౌంటరిచ్చారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాత్రం జగన్ స్పందించడానికి అంతగా ఇష్టపడలేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలే చేశారు. మరి మున్ముంథు ఇంకా ఎన్నెన్ని వ్యవహారాలు ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలు బయటపెట్టుకుంటాయో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.